Saturday, November 3, 2012

ఒక విద్రోహదినం

ఒక విద్రోహదినం
డా||కాసుల లింగారెడ్డి

''తాళి కట్టించి 
తన్నుకు సావమని
సాపెన పెట్టిండు సచ్చినోడు''
తుంటరి ఆంధ్ర పిల్లవాడికి,అమాయకపు తెలంగాణ పిల్లను అంటగట్టిన కుట్రకు బాధ్యులెవ్వరు? కాలపు యవనిక మీద ఒలికిన వికృత గర్భస్రావాలకు కారకులెవ్వరు? ఏకాత్మ సాంస్కృతిక గుంపుగా మద్రాసు రాష్ట్రం నుండి విడివడ్డ ఆంధ్రులు బహుళ సంస్కృతికి వారసులైన తెలంగాణ ప్రజలమీద ఆధిపత్యం చెలాయిస్తారని, రాజకీయంగా, విద్యాపరంగా ముందున్నవాళ్ళు తెలంగాణ అవకాశాలు కొల్లగొట్టుకు పోతారని తెలిసే ఒక అసంబద్ధ కలయిక ద్వారా తెలంగాణ ప్రజలపట్ల ఈ మహా విద్రోహానికి తెరతీసింది ఎవ్వరు? 
నిజానికి నవంబర్‌ 1, 1956 లో ఏర్పడ్డ 'ఆంధ్రప్రదేశ్‌' అనే పేరేలోనే వలసాధిపత్యం వ్యక్తమౌతన్నది.తెలంగాణ ప్రజల మనోభీష్టాలకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రం ఎందుకు ఏర్పడిందో తెలియాలంటే మనం చరిత్రలోకి తొంగిచూడాలి.
1905లో బెంగాల్‌ విభజన సందర్భంలోనే భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట ఆంధ్ర, తెలంగాణలను కలపాలని భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రతిపాదనలు చేసింది.1920 నాగపూర్‌ కాంగ్రెస్‌లో భాషాప్రయుక్తరాష్ట్రాల పునర్విభజనకు సంబంధించిన తీర్మానం చేశారు. 1927లో ఇండియన్‌ స్టాట్యుటరీ కమిషన్‌ వేసి ఆంధ్ర, సింధు,ఉత్కళ,కర్ణాటక రాష్ట్రాల్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైనరు. తదుపరి నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన అఖిలపక్ష కమిటీ విద్యాబోధనాపరంగా, పాలనా సౌలభ్యంగా ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే ప్రజలుండాలని, కాని భాషా సాంస్కృతిక ఐక్యతతో పాటు అక్కడి ప్రజల ఆకాంక్షలు ప్రధాన ప్రాతిపదికగా వుండాలిని తీర్మానించింది. 1937లో కలకత్తా సదస్సులో భాషాప్రాతిపదికగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తీర్మానించింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ 1938లో వార్థాలో జరుపుకున్న కార్యనిర్వాహక సమావేశంలో ఆంధ్ర,కర్ణాటక, కేరళ రాష్ట్రాల్ని ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
స్వాతంత్య్రోత్సవానంతరం నవంబర్‌ 27, 1947 పార్లమెంట్‌లో మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ భారతదేశ భద్రత, సార్వభౌమత్వం ఆనాటి తక్షణ కర్తవ్యాలని,భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఆలోచించాల్సిన విషయమని ఉద్ఘాటించారు.ఆంధ్ర, మహారాష్ట్రాలనుంచి వచ్చిన వత్తిడి కారణంగా జూన్‌ 17,1948లో భారత ప్రభుత్వం ఎస్‌.కె.దార్‌ చైర్మన్‌గా పన్నాలాల్‌,జగత్‌నారాయణలాల్‌ సభ్యులుగా దార్‌ కమిషన్‌ వేసి, ఆంధ్ర, కేరళ,కర్ణాటక,మహారాష్ట్రల ఏర్పాటును పరిశీలించమని చెప్పింది. 10 డిసెంబర్‌ 1948 నాడు సమర్పించిన రిపోర్టులో దార్‌ కమిషన్‌ కేవలం భాషా ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఆచరణీయం కాదని, ఏక భాష సూత్రీకరణ కేవలం పరిపాలన సౌలభ్యానికి మాత్రమేనని, అది చాలా పరిమిత ప్రయోజనమని పేర్కొంటూ ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులలో రాష్ట్రాల పునర్వస్థీకరణ పూర్తిగా అనవసరమని అభిప్రాయపడింది. అదే సమయంలో చరిత్ర,భౌగోళికత,ఆర్థిక, సాంస్కృతిక అంశాలకు పెద్దపీట వేస్తూ భాషాప్రయుక్త రాష్ట్రానికి తప్పక ఉండాల్సిన లక్షణాలను వివరించింది.అవి భౌగోళిక ఐక్యత,ఆర్థిక స్వయంపోషకత,భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి గల అవకాశాలు, ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య పరస్పర అంగీకారం, మెజారిటీగా వున్న ప్రాంత ప్రజలు మైనారిటీగా వున్న ప్రాంత ప్రజలమీద వత్తిడి చేయకుండా వుండడంగా పేర్కొంది(తెలంగాణ ఏర్పాటు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది).
దార్‌ కమిషన్‌ ప్రతిపాదనలను దృష్టిలో వుంచుకొని భారత ప్రభుత్వం 1948లో జైపూర్‌ సదస్సులో జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభభాయి పటేల్‌, పట్టాభిలతో జె.వి.పి.కమిటీ వేసింది. కాంగ్రెస్‌పార్టీ ఈ కమిటీ ద్వారా మొట్టమొదటిసారిగా భాషాప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ ఇంతకుముందు భాషాప్రయుక్త రాష్ట్రాలను సమర్థించినస్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఆచరణకు సంబంధించిన సమస్యలను విస్మరించిందని, ఇప్పుడు తక్షణ కర్తవ్యాలు దేశరక్షణ,ఆర్థిక అభివృది,్ధ ఐక్యత మాత్రమేనని,రాష్ట్రాల పునర్విభజన కాదని, భాష కలిపివుంచే సాధనమే కాని, విడదీసే అంశము కూడా అని (సామాజిక,ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం వల్ల తెలంగాణలో అదే జరిగింది), భారతదేశ రాజకీయ,ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఐతే ఆంధ్రరాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పరచాలని జె.వి.పి. కమిటి తీర్మానించిన దృష్ట్యా 1951 సాధారణ ఎన్నికల మానిఫెస్టోలో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి వున్నట్టుగా చెప్పుకుంది. అట్లాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అక్కడి ప్రజల అంగీకారం మేరకు ఏర్పరచాలని తీర్మానించింది. ఇక్కడ తెలంగాణ ప్రస్తావన లేకపోవడం గమనించాల్సిన విషయం.
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు ఆలస్యమౌతున్నదని భావించిన రాజకీయ నాయకులు ఉద్యమ సన్నాహాలు చేసినరు. దానిలో భాగంగానే నిరాహారదీక్షకు కూర్చున్న స్వామిసీతారాం నలభైఐదు రోజుల తర్వాత వినోభా బావే అభ్యర్థన మేరకు అది విరమించడం జరిగింది. కాని, వెంటనే పొట్టిశ్రీరాములు నిరాహారదీక్ష చేసి 15 డిసెంబర్‌1952 నాడు మరణించిండు. దాంతో ఆగ్రహావేశాలకు లోనైన ఆంధ్ర ప్రజలు రైళ్ళను ఆపిండ్రు.భోగీలను లూటీ చేసిండ్రు.ప్రభుత్వ ఆస్థులను తగులబెట్టిండ్రు. పోలీసు కాల్పుల్లో చనిపోయిండ్రు. ఈ అల్లర్లకు భయపడ్డ నెహ్రూ నాలుగు రోజుల తర్వాత 1953లో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని, దానికి సంబంధించి ఆర్థిక, పాలన అంశాలతోపాటు బల్లారి,మద్రాసు పట్టణాలకు సంబంధించిన వివాదాన్ని పరీక్షించాలని జెస్టిస్‌ వాంకూ ఆధ్వర్యంలో కమిటీని వేయడం జరిగింది. తదనుగుణంగా 1953 అక్టోబర్‌లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. భాషాప్రయుక్త రాష్ట్రాల పీడకలలు నెహ్రూను రెండేండ్ల తర్వాత కూడా వెంటాడాయి.1955, మే నెలలో బరంపురంలో మాట్లడుతూ నెహ్రూ విభిన్న భాషలు మాట్లాడే ప్రజలు కలిసి ఒకే రాష్ట్రంలో వుండడం శ్రేయస్కరమని చెప్పాడు.
కాని,ఆంధ్రులు ముఖ్యంగా కమ్యూనిష్టులు విశాలాంధ్రలో ప్రజారాజ్యం పేరిట ఉద్యమించడం వల్లనైతేనేమి, కాంగ్రెస్‌వాళ్ళతో కలిసి నెహ్రూమీద ఒత్తిడి పెంచడం వల్లనైతేనేమి భారత ప్రభుత్వం 1953 డిసెంబర్‌29న ఫజల్‌ అలీ చైర్మన్‌గా కుంజ్రు,ఫణిక్కర్‌లు సభ్యులుగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ వేయడం జరిగింది. సరిగ్గా ఈ సమయానికి తెలంగాణ విశ్వవిఖ్యాత సాయుధపోరాటం విరమించి,ఎన్నికలు నిర్వహించుకొని బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా స్వయంపాలిత రాష్ట్రాన్ని ఏర్పరుచుకుంది.తెలంగాణ సాయుధపోరాట కాలంలో ఉమ్మడి కమిటిగా వున్న కమ్యూనిష్టు పార్టీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం స్థాపిస్తామని, అందుకు రెండు(ఆంధ్ర,తెలంగాణ) రాష్ట్రాల్ని విలీనం చేయాలని ఉద్యమించింది. రెండు అసమ సమాజాల్ని(ఆంధ్రరాష్ట్రంలోని అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ,తెలంగాణలోని ఫ్యూడల్‌ వ్యవస్థలు)కలపమని ఉద్యమించడంలో ఔచిత్యమేమిటో? తెలుగువాళ్ళంతా ఒకే జాతి అని, అందుకే కలిసుండాలని వాళ్ళు చెప్పడం అప్పుడప్పుడూ వింటుంటాము. ఈ కమ్యూనిష్టులకు జాతుల సమస్యమీద స్టాలిన్‌ రాసిన వ్యాసం అర్థం కాలేదా? ఒకేభాష, ఒకే భౌగోళిక ప్రాంతం,ఒకే చరిత్ర,ఒకే సామాజిక ఆర్థిక వ్యవస్థ,మేమంతా ఒక్కటే అనే భావనతో కూడిన సంస్కృతి కలిగిన ప్రజాసమూహాన్ని జాతిగా నిర్వచించడం జరిగింది. ఒక్క భాష తప్ప ఇక్కడ ఉమ్మడి అంశం మరేమైనా వుందా? ఆ భాషను కూడా యాస పేరిటి ఎకసెక్కం చేస్తున్నారే! కాకతీయులు, శాతవాహనులు ఏర్పరిచిన సామ్రాజ్యాలు తప్ప ఒకే పాలనలోవున్న కాలం బహు స్వల్పం కదా! విజయనగర సామ్రాజ్యంతో తెలంగాణకున్న సంబంధమేంది? పల్లవుల ప్రస్తావన తెలంగాణ ప్రజల జీవితాలలో ఎందుకు తెస్తారు? తెలంగాణ సాయుధపోరాట విరమణ 1951 (అక్టోబర్‌ 21)లోనే ఎందుకు జరిగింది? 1948 సెప్టెంబర్‌ 17 నాడు హైదరాబాద్‌ స్టేట్‌ భారతయూనియన్‌లో విలీనమైన తర్వాత ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పు, మారిన వైరుధ్యాలను పరిగణలలోకి తీసుకుంటే, ఆ రోజే విరమణ చేసి వుండాల్సిందన్న రావినారాయణరెడ్డి వాదనలో నిజంలేదా? లేదూ భారతయూనియన్‌ సైన్యాల్ని ఓడించి హైదరాబాద్‌ స్టేట్‌ను విముక్తం చేయగలమనే నమ్మకముంటే సాయుధపోరాటాన్ని కొనసాగించకుండా 1951లోనే ఎందుకు విరమించాలె? 1952లో రానున్న సాధారణ ఎన్నికల దృష్టితోనే విరమణ జరిగిందన్నది నిజం కాదా? ఎన్నికల్లో పి.డి.ఎఫ్‌. తెలంగాణలో సాధించుకున్న సీట్ల (పార్లమెంట్‌ 5/10,శాసనసభ 40/80) ఆధారంగా ఆంధ్ర,హైదరాబాద్‌ రాష్ట్రాల విలీనంద్వారా అధికారంలోకి రావాలని పథకం వేసింది నిజం కాదా? అధికారం కోసం(అదీ ఎన్నికల ద్వారా వచ్చే అధికారం) కోసం ఒక కమ్యూనిష్టు పార్టీ ఈ అసంబద్ధ కలయిక కోసం ఉద్యమించడం, లాబీయింగ్‌ చేయడం చరిత్రలో మరెక్కడైనా చూశామా? పి.డి.ఎఫ్‌. నుంచి శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన వి.డి.దేశ్‌పాండే జూన్‌ 16, 1952 నాడు హైదరాబాద్‌ స్టేట్‌ను ఆంధ్రరాష్ట్రంలో కలపాలని అసెంబ్లీలో పెట్టిన తీర్మానం 79/63 ఓట్లతో వీగిపోయినంక విశాలాంధ్ర ప్రయత్నాలు ఎందుకు విరమించలేదు?
సరే, ఇదిట్లా వుంచి ఫజల్‌అలీ కమిషన్‌ అక్టోబర్‌ 10,1955న ఇచ్చిన రిపోర్టును పరిశీలిద్దాం.ఒక వేళ విశాలాంధ్ర ఏర్పాటు చేస్తే, హైదరాబాద్‌ రూపంలో ఆంధ్రరాష్ట్రానికి ఒక పర్మినెంట్‌ రాజధాని దొరుకుతుంది. వాళ్ళ రాజధాని సమస్య తీరుతుంది. కృష్ణ, గోదావరి జలాల్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు.ఆంధ్రలో బొగ్గుగనులు లేవు కాబట్టి థర్మల్‌పవర్‌ కోసం సింగరేణి మీద ఆధారపడవచ్చు. ఇవీ ఆంధ్రరాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనాలు. అదే తెలంగాణ విషయానికి వస్తే, ఆంధ్రరాష్ట్రం ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో తెలంగాణలో మిగులు వుంది. ఎందుకంటే, తెలంగాణలో భూమిశిస్తు ఎక్కవగా వుండేది. ఎక్సైజ్‌ ద్వారా ఐదుకోట్ల ఆదాయం వుండేది(అప్పుడు ఆంధ్రలో ప్రొహిబిషన్‌ అమలులోవుండింది). కాబట్టి, కలయిక ఆర్థికంగా తెలంగాణకు నష్టం. నందికొండ(కృష్ణ),కుష్టాపురం(గోదావరి) ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్యగోచరమౌతుంది. కృష్ణ,గోదావరి నీళ్ళను స్వతంత్రంగా వాడుకునే స్వేచ్ఛను తెలంగాణ కోల్పోతుంది. విద్యాపరంగా ముందున్న ఆంధ్రులచేత తెలంగాణ విద్య,ఉద్యోగ అవకాశాలు కొల్లగొట్టబడుతాయి. మెజారటీగావున్న ఆంధ్రులు, మైనారిటీగా వున్న తెలంగాణ ప్రజలమీద ఆధిపత్యం చెలాయిస్తారు. ఇంత స్పష్టంగా చెప్తూనే, తెలంగాణకు కొన్ని రక్షణలిచ్చి విలీనం చేసినా కూడ అవి సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు లేవని, చరిత్రలో ఇట్లాంటి ఒప్పందపు రక్షణలు అమలైన దాఖలాలు లేవని చెప్పింది. దానికి మంచి ఉదాహరణలుగా శ్రీభాగ్‌ ఒడంబడిక(రాయలసీమను ఆంధ్రలో కలుపుకునేందుకు చేసుకున్న ఒప్పందం), బ్రిటిష్‌ కింగ్‌డమ్‌లోని స్కాటిష్‌ డివల్యూషన్‌(స్కాట్లాండుకు ఇచ్చిన రాజ్యాంగపరమైన హక్కులు)లను పేర్కొంది. కాబట్టి 1961 సాధారణ ఎన్నికల వరకు ఆంధ్ర,తెలంగాణలను ప్రత్యేక రాష్ట్రాలుగానే వుంచాలని, అటుపిమ్మట హైదరాబాదు స్టేట్‌ అసెంబ్లీ కనుక మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదిస్తే విలీనం చేయవచ్చునని చెప్పింది. ఇట్లా ఫజల్‌అలీ కమిషన్‌ ప్రతిపాదనలు తుంగలో తొక్కి 1956 నవంబర్‌, 1న తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
''తాటికమ్మల గుడిసన్నా లేదని
రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన
కాసులు లేని కనా కష్టకాలంల
నిలువగరిసెలిచ్చి నిలబెట్టిన
గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె
కుడిదాయిని కుడిపి కుతిదీర్చిన
నా రామసక్కని కుర్చీ యిచ్చి సదువుకున్నోనివని రాజును చేసిన
నిన్నేమన్న కర్రెకుక్కను చేసి ఎంటదిప్పుకుంటినా?''
నెహ్రూ మీద ఒత్తిడితేవడంలో ప్రధాన పాత్రవహించిన తెలంగాణ పి.సి.సి. అధ్యకక్షులు రామానందతీర్థ, కమ్యూనిష్టు పార్టీ సెక్రెటరీ పుచ్చలపల్లి సుందరయ్యలు తెలంగాణేతరులు కావడం తెలంగాణ దౌర్భాగ్యమే. ఎందుకంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యం డాక్యుమెంటులో, విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రలో కృష్ణ,గోదావరి నదులమీద కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి,నెలకొల్పవలసిన పరిశ్రమల గురించి చర్చించిన సుందరయ్య తెలంగాణ విషయంలో ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన చేయకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది.
పెద్దమనుషుల ఒప్పందం చేసుకొని 1956,నవంబర్‌1న ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణకు ఇవ్వకపోవడం, అదేమంటే ఆరోవేలు అనడం ఒక పెద్ద దగా. రీజనల్‌ కమిషన్‌ను రీజనల్‌ కమిటిగా మార్చడం మరొక కుట్ర. ఈ కుట్రల దొంతర ఈనాటిదాకా నిరంతరాయంగా కొనసాగుతున్న సంగతి తెలిసందే. 1952 లోనే, అంటే ఆంధ్రరాష్ట్రం ఏర్పడకముందే ఆంధ్రులు ముల్కీ రూల్స్‌కు విరుద్ధంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు సంపాదించడం హెచ్చరికగా తీసుకొని, తదుపరి పరిణామాలను అంచనా వేసుకొనివుండాల్సింది.
''మర్లువెళ్ళన్నా కాలేదు
కాళ్ళ పారాణన్నా ఆరలేదు
ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి
నీకూ నాకూ మధ్య నియమాలెందుకంటివి
పొలిమేరలు చెరిపేసిన నగ్న దేహాల
నగ్నాత్మల ఊసులిప్పమంటివి
సంపదలు నీకు సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి
ఈ కాపురం నేనొల్లనంటే
కూసున్న పెద్దమనుషులు కాసింత సర్ది చెప్పి
కాపురం నిలబెట్టిరి''
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగిన వెంటనే ఉపముఖ్యమంత్రి విషయంలో, రీజనల్‌ కమిషన్‌ విషయంలో జరిగిన విద్రోహాలే కాకుండా, అప్పటిదాకా అధికార భాషగా వున్న ఉర్దూను తొలగించి తెలుగు,ఇంగ్లీషులను ప్రవేశపెట్టడం వలన తెలంగాణలోని స్థానికులు పెద్దయెత్తున ఉద్యోగాలు కోల్పోవలిసి వచ్చింది. ఆంధ్రులు ఆధిపత్యంతో,అహంకారంతో తెలంగాణ ప్రజలను అవమానపర్చిండ్రు. విద్య,ఉద్యోగ అవకాశాలను కొల్లగొట్టిండ్రు. నీళ్ళు,నిధులను దోచిండ్రు. ఈ విషయాల్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు 1956లో ముల్కీ ఉద్యమం లేవదీసిండ్రు.'హైదరాబాద్‌ హైదరాబాదీలదే' అనే నినాదంతో స్థానికేతరులను నిలదీసిండ్రు.1969 నాటికి విద్య,ఉద్యోగాల్లో ఎంత నష్టం జరిగిందో తెలుసుకొని ఉవ్వెత్తున స్వరాష్ట్ర ఉద్యమాన్ని నడిపిండ్రు. చెన్నారెడ్డి ద్రోహంవల్ల కృంగిపోయిన తెలంగాణ ప్రజలు స్తబ్దతకు గురైండ్రు. కాని 1985 తర్వాత తెలుగుదేశం కమ్మకుల ప్రతినిధిగా తెలంగాణ మీద దోపిడి,అణచివేతల్ని మరింత బాహాటంగా కొనసాగించడం, చంద్రబాబు నాయుడు అభివృద్ది పేరిట చేసిన దిక్కుమాలిన ప్రయోగాలకు, నీళ్ళు నిధుల విషయంలో చూపిన విక్షతకు వ్యతిరేకంగా మలిథ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇది అనేక రూపాలు మార్చుకుంటూ సకల జనుల సమ్మెతో పతాకస్థాయికి చేరుకుంది.2009 డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి యు.పి.ఎ.ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేటట్లుగా వ్యూహాన్ని రూపొందించుకొని తెలంగాణ తెచ్చుకోవడం ద్వారా ఈ విద్రోహ చరిత్రకు తెరదించాలి.
''బళ్ళు నీవి గుళ్ళు నీవి
మడులు నీవి మాన్యాలు నీవి
మల్లెసాలమీద మంచమేసి
సాధికారంగా సకులం ముకులం పెట్టి
చర్నాకోల చేతవట్టి
నా ఇంట్ల నన్ను బాంచెదాన్ని చేస్తివి
ఇగ ఇప్పుడైనా
పనుగట్ల పంచాయితి పెట్టి
ఇడుపుగాయితం అడుగక
ఇంకేం చెయ్యాలె''

(నవంబర్‌ 1,2011న జనగామలో 'తెలంగాణ సామాజిక చైతన్యవేదిక' 
నిర్వహించిన సదస్సులో చేసిన ప్రసంగ పాఠం)

No comments: